CM KCR | నాగ్పూర్ : దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తొంది..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయమేస్తోంది. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. జనాలు గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరడం లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని కేసీఆర్ తెలిపారు. కానీ అలాంటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదు. మహారాష్ట్ర సంగతి పక్కకు పెట్టండి.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే దుస్థితి. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొరత సమస్య కూడా ఉందని తెలిపారు కేసీఆర్.
మహారాష్ట్రలో అనేక పార్టీల నుంచి సీఎంలు వచ్చారని పేర్కొన్న కేసీఆర్.. ఈ రాష్ట్ర పరిస్థితులను మాత్రం ఏ సీఎం కూడా మార్చలేదన్నారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం..? ప్రస్తుతం మన దేశంలో దళితుల పరిస్థితి ఏంటి..? ఎస్సీల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగింది. దేశంలో దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటికీ వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని కేసీఆర్ చెప్పారు. ప్రపంచంలో భారత్లోనే ఎక్కువ శాతం సాగు యోగ్యమైన భూమి ఉంది. మనం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు. భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు ఎందుకీ కష్టాలు. జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుంది. విద్యుత్ విషయంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో బొగ్గుకు కొరత లేదు, అయినా విద్యుత్ సమస్య ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏండ్లు విద్యుత్ ఇవ్వొచ్చని కోల్ ఇండియానే చెప్పింది. వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదు. గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ లభిస్తోంది. పుష్కలంగా సాగునీరు కూడా అందిస్తున్నాం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని కేసీఆర్ తెలిపారు.