CM KCR | ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధాని నరేంద్ర మోదీకి చేతులు రాలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు విమర్శించారు. నాందేడ్లో సచ్ఖండ్బోడ్ మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో ఏటా రూ.5లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారని, కానీ రైతులకు రూ.10వేలు ఇవ్వరని సీఎం కేసీఆర్ అన్నారు.
13 నెలలు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని, ఢిల్లీలో రైతులు చనిపోతే నాకోసం చనిపోయారా? అని ప్రధాని ప్రశ్నించడం చాలా బాధకరమన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవాలని చెబితే మోదీకి చేతులు రాలేదన్నారు. ఫసల్ బీమా అనేది జూటా అన్న కేసీఆర్.. మద్దతు ధర కోసం చక్కెర ఫ్యాక్టరీల దగ్గర ప్రతి సంవత్సరం ధర్నాలు చేయాలా? అని నిలదీశారు. కిసాన్ సర్కార్ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు. గులాబీ సర్కార్ రాగానే.. మహారాష్ట్రలో 24 గంటల కరెంటు వస్తుందన్నారు. తెలంగాణలో కరెంట్ విషయంలో నిరూపించామన్న కేసీఆర్.. దేశమంతా సుసాధ్యం చేస్తామని స్పష్టం చేశారు.
తన మాటల్లో నిజం ఉందని, గులాబీ జెండా భుజాన వేసుకుని కదలిరండి అంటూ పిలుపునిచ్చారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయని, అవన్నీ పరిష్కారం కావాలన్నారు. దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ రాగానే దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామన్నారు. యుద్ధం చేయండి.. తల్వార్లు తిప్పండి అని తాను చెప్పడం లేదని.. కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతుందని కేసీఆర్ అన్నారు.