CM KCR | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ.. పదో వసంతంలో అడుగుతున్నపెడుతున్నది. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను వైభవోపేతంగా, ఘనంగా జరుపాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఉత్సవాలు తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా.. ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2 నుంచి 21 రోజుల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సచివాలయంలో తొలి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజులు రాష్ట్ర మంత్రులు వారివారి జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2 నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రం. అయినా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. నేడు తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం’ సీఎం పేర్కొన్నారు.
‘అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుంది. తెలంగాణలో అదే జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణపై నిర్ధిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని ఉన్నదనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని సీఎం తెలిపారు.
పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరంతో పాటు మరో కరోనా కాలపు రెండేండ్లు దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా, వ్యవసాయం విద్యుత్, తాగునీరు, సాగునీరు, పల్లెలు పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతి, తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక ఐటీ అభివృద్ధి, సింగరేణి, ప్రతి ఓ రంగంలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన ప్రగతి గురించి సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.