న్యూ ఢిల్లీ: దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నడిబొడ్డున సర్దార్ పటేల్ రోడ్డులో పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్ చేరుకొంటారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోవైపు ఇదే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు హస్తినకు చేరుకున్నారు. సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖ నేతలు హాజరవుతున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోపాటు రైతు ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు వస్తున్నారు. బీహార్కు చెందిన ప్రభాత్కుమార్, ఉత్తరాఖండ్ నుంచి పీసీ తివారీ, మహారాష్ట్రకు చెందిన మాణిక్ కదం, ఉత్తర్ప్రదేశ్ నుంచి డాక్టర్ రాకేశ్ రఫీక్, ఒడిశాకు చెందిన అక్షయ్కుమార్, హర్యానా నుంచి గుర్నాంసింగ్ చదానీ, పంజాబ్, మహారాష్ర్టకు చెందిన పలువురు రైతు సంఘాల నేతలు కూడా రానున్నట్టు సమాచారం.