CM KCR | నాగ్పూర్ : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మేధావులు, యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాణాత్మక మార్పు వస్తేనే దేశంలో ఎలాంటి అభివృద్ధి అయినా సాధ్యం అవుతుందన్నారు కేసీఆర్. నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడారు.
వ్యవసాయం ప్రధాన వృత్తి కలిగిన దేశం మనది అని కేసీఆర్ అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. పప్పులు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీపావళికి పేల్చే పటాకులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో అవసరానికి మించిన నీటి వనరులు ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాం. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నా తాగు నీటి కోసం ప్రజలు గోసపడుతున్నారు. దేశ జల విధానాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. నదుల నీటి కోసం రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమి 41 కోట్ల ఎకరాలు ఉంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి. జపాన్ లాంటి ఎన్నో చిన్న దేశాల్లో వేల టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి. మన దేశంలో అలాంటి రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తే దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించొచ్చు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వొచ్చు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉందని కేసీఆర్ తెలిపారు. ఈ బొగ్గును కరెక్ట్గా వాడితే దేశానికి 150 ఏండ్లకు సరిపోయే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఎయిర్పోర్టులు, రైల్వేలు, రోడ్లు మరింత అభివృద్ధి చేయాలి. ఇన్నేండ్ల తర్వాత కూడా దేశంలో రవాణా వ్యవస్థ దారుణంగా ఉంది. సింగపూర్లో ఎలాంటి వనరులు లేకున్నా అద్భుతంగా అభివృద్ధి సాధించారు. సింగపూర్లో మట్టిని కూడా ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎలాంటి వనరులు లేకున్నా సింగపూర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. మానవ వనరుల అభివృద్ధి, తలసరి విద్యుత్ వినియోగంలోనూ భారత్ వెనుకబడింది. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.