హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు. పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు మోదీ దురహంకారానికి, రాజ్యమేలుతున్న నియంతృత్వానికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోదీ ప్రభుత్వం.. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకు వినియోగించుకోవడం గర్హనీయమని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నదని, ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.