Manipur | ఇంఫాల్, జూన్ 25: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంటలు ఇంకా ఆరలేదు. కానీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చెబుతూ కేంద్రంలోని బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నది. రాష్ట్రంలో పరిస్థితులు సవ్యంగానే ఉన్నాయని, అంతా ప్రశాంతంగా ఉందంటూ బుకాయిస్తున్నది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా ఘర్షణ వాతావరణమే కొనసాగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు ఏకంగా ఆర్మీని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఒక రోజంతా భద్రతా బలగాలను ముందుకు కదలకుండా చేశారు. సుమారు 1500 మంది మహిళా ఆందోళనకారులు ఆర్మీని అడ్డగించారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అనడానికి ఈ ఘటన అద్దం పడుతున్నది.
కుగ్రామంలో మహిళల ఆందోళన
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నది. తిరుగుబాటుదారులతో పాటు ఆందోళనకారులు వారిని అడ్డగిస్తున్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఇథం గ్రామంలో 12 మంది మైతీ తెగకు చెందిన కేవైకేఎల్ మిలిటెంట్లు దాక్కున్నారన్న సమాచారంతో బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో మహిళల నాయకత్వంలోని సుమారు 1500 మంది ఆందోళనకారులు బలగాలను చుట్టుముట్టారు. మిలిటెంట్లను విడిచిపెట్టాలని వారు ఆందోళనకు దిగారు. దీంతో శనివారం నుంచి ఆ గ్రామంలో ప్రతిష్టంభన నెలకొంది. చివరికి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని ఆర్మీ ఆదివారం మిలిటెంట్లతో పాటు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విడిచి వెళ్లిపోయింది.
ఇంకా టెన్షన్ టెన్షన్గానే..
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా టెన్షన్ వాతావరణమే ఉన్నది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, ఆర్మీ పహారా కొనసాగుతున్నది. ఇంఫాల్ తూర్పు జిల్లాలో 24 గంటల వ్యవధిలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. పోలీసులు టియ్యర్ గ్యాస్ వాడి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 1100 ఆయుధాలు, 13,702 పేలుడు పదార్థాలు, 250 బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అమిత్ షాతో సీఎం బీరేన్సింగ్ భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో మణిపూర్ సీఎం బీరేన్సింగ్ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని, అమిత్ షా తనకు హామీ ఇచ్చారని భేటీ అనంతరం బీరేన్సింగ్ తెలిపారు.