న్యూఢిల్లీ/ఇంఫాల్, జూన్ 26: మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సత్వర చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మణిపూర్ పరిస్థితిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అనంతరం ఇంఫాల్ చేరుకొన్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చెప్పలేమని వ్యాఖ్యానించారు. హింస మొదటి దశ రాజకీయంగా, సున్నితంగా ఉన్నదని, అయితే ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చెప్పలేమని, రాష్ట్రంలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో హింస స్వభావం మారిపోయిందని, మారుమూల ప్రాంతాల్లో కాల్పులు, లోయ జిల్లాల్లో పౌర అశాంతికి దారితీసిందని చెప్పారు. అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.
సెర్చ్ ఆపరేషన్లలో భాగంగా 24 గంటల వ్యవధిలో 12 బంకర్లను ధ్వంసం చేశామని, ఆరు మోర్టార్ షెల్స్ను స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. సాహుమ్ఫైలోని పంట పొలాల్లో మోర్టార్ షెల్స్ను, బిష్ణుపూర్ జిల్లాలోని కొట్లిన్ గ్రామ సమీపంలో ఐఈడీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు.
మణిపూర్లో ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తంగా 1,100 ఆయుధాలతో పాటు 13,702 మందుగుండు సామగ్రి, 250 బాంబులను రికవరీ చేసుకొన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుస్టేషన్లు, ఆయుధాగారాల నుంచి ఎన్ని అయుధాలు లూటీకి గురయ్యాయనే దానిపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఆయుధాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు ధ్వంసం చేయడమో లేదా తీసుకెళ్లిపోవడమే ఇందుకు కారణమని ఓ ఇంగ్లిషు వార్తాపత్రిక నివేదించింది. హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మే 3 నుంచి ఏకే-47 వంటి తుపాకులు, 4 వేల ఆయుధాలు లూటీకి గురయ్యాయని పేర్కొన్నది.
రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాయని స్థానిక గిరిజన సంఘం ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ఐటీఎల్ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం బీరేన్తో ఎటువంటి చర్చలు చేసేది లేదని తేల్చిచెప్పింది. మణిపూర్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రాజకీయ పరిష్కారం చూపడకుండా, శాంతి చర్చలు అంటూ ప్రతిపాదనలు చేయడంలో అర్థం లేదని ఐటీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ అన్నారు. హింసాత్మక ఘటనల్లో దాదాపు 100 మందికి పైగా గిరిజనులు మరణించారని, 201 గ్రామాలు మంటల్లో కాలిపోయాయని, 5 వేలకు పైగా ఇండ్లు, 355 చర్చిలను ధ్వంసం చేశారని చెప్పారు. కుకీ-జో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఐటీఎల్ఎఫ్ డిమాండ్ చేస్తున్నది.