Climate Disasters | ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు ఓ నివేదిక తాజాగా వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన దేశాల్లో భారత్ (Climate Disasters) తొమ్మిదో స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 వరకూ చోటుచేసుకున్న 430 ప్రకృతి విపత్తుల్లో 80,000 మంది మరణించారు. సుమారు 130 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అంతేకాదు 170 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (think tank Germanwatch Climate Risk Index) నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నష్టం 1998 గుజరాత్ తుపాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుపాను, 2013 ఉత్తరాఖండ్ వరదలు సహా, కరవు, హీట్వేవ్స్ వల్ల సంభవించినవిగా సదరు నివేదిక తెలిపింది.
వాతావరణ పరిస్థితులు భారత్లో అభివృద్ధి, జీవనోపాధికి పెను ముప్పుగా మారినట్లు సదరు నివేదిక పేర్కొంది. ప్రకృతి విపత్తులు ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది. 2024లో భారత్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వదలతో తీవ్రంగా నష్టం జరిగినట్లు పేర్కొంది. దాదాపు 8 మిలియన్లకుపైగా ప్రజలు, ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలను తీవ్ర ప్రభావితం చేశాయని సదరు నివేదిక వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 1995-2024 మధ్య 9,700 కంటే ఎక్కువ తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించినట్లు సదరు నివేదిక తెలిపింది. దాదాపు 8.3 లక్షలకు పైగా మరణాలు సంభవించినట్లు పేర్కొంది. ఈ విపత్తులు 5.7 బిలియన్ల మందిని ప్రభావితం చేసినట్లు వివరించింది. దాదాపు 4.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని కలిగించాయని జర్మన్ వాచ్ తెలిపింది. గత మూడు దశాబ్దాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులకు డొమెనికా దేశం అత్యంత ప్రభావితమైనట్లు జర్మన్ వాచ్ నివేదిక వెల్లడిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, హోండురాస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా, భారత్, బహామాస్ ఉన్నాయి.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు..!