న్యూఢిల్లీ, జూన్ 27: కరోనా వ్యాక్సిన్లపై ఉన్న అనుమానాలను విడిచిపెట్టాలని, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా ఉందని హెచ్చరిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలని సూచించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కొన్ని వర్గాల ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ల గురించి అనవసర భయాలు, సందేహాలు ఏర్పడ్డాయని చెప్పారు. తాను, దాదాపు వందేండ్ల వయసున్న తన తల్లి కూడా టీకా రెండు డోసులు వేయించుకున్నామని తెలిపారు. సైన్స్ని, సైంటిస్టులని ప్రజలు నమ్మాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. కరోనా పోయిందని ఎవరైనా చెబితే అది పొరపాటే అవుతుందని, అలాంటి తప్పు భావనలో ఉండొద్దని సూచించారు. కరోనా మహమ్మారి అనేక వేషాలు మార్చడంలో దిట్ట అని వ్యాఖ్యానిస్తూ రూపాంతరం చెందగల దాని సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు 31 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. ఈ నెల 21న ఒక్క రోజులో 86 లక్షల వ్యాక్సిన్ డోసులు వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరోనాపై యుద్ధంలో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. కరోనా సోకి ఇటీవల మరణించిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర సేవలను ప్రధాని గుర్తుచేసుకున్నారు.
ఉపాధ్యాయుడి కృషికి ప్రశంస
వానకాలం వచ్చిన నేపథ్యంలో నీటి పొదుపు అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. నీటిని పొదుపు చేయడమంటే దేశ సేవ చేయడమేనని చెప్పారు. ఈ సందర్భంలో ఉత్తరాఖండ్లోని పౌరి ఘర్వాల్కు చెందిన ఉపాధ్యాయుడు సచ్చిదానంద్ భారతి సేవలను ప్రస్తుతించారు. ఆయన కృషితో వారి ప్రాంతంలో నీటి సంక్షోభానికి తెరపడిందన్నారు. ఇటీవల కన్నమూసిన భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్కు ప్రధాని నివాళులర్పించారు.
ఈ నెలలో 10 కోట్ల కొవిషీల్డ్ డోసుల ఉత్పత్తి: సీరం
న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటివరకు 10 కోట్లకుపైగా కొవిషీల్డ్ టీకా డోసులను ఉత్పత్తి చేసినట్టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఆదివారం వెల్లడించింది. గతనెలలో 6.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగా, జూన్ నెలలో ఆ సామర్థ్యాన్ని పది కోట్లకు పెంచుతామని గత నెలలో సీరం సంస్థ కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. నెల పూర్తికాకుండానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నది.