పుణె: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’ (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాలను అసలు మూల్యాంకనం చేయకపోవడం, కొన్ని జవాబు పత్రాల లభ్యత ఆలస్యం కావడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు దేశవ్యాప్తంగా పలువురు సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా తమకు గ్రేస్ మార్కులు కేటాయించాలని, మార్కుల వెరిఫికేషన్, పునఃమూల్యాంకనం ఫీజులను పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
జూన్ 5 నాటికి దేశవ్యాప్తంగా వెరిఫికేషన్, పునఃమూల్యాకనం కోసం సీబీఎస్ఈ బోర్డుకు 60 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. మూల్యాంకన ప్రక్రియలోని లోపాల వలన జరిగిన తప్పులను సరిదిద్దేందుకు తామెందుకు డబ్బులు చెల్లించాలని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికల్లో కొందరు విద్యార్థులు తమ జవాబు పత్రాల స్క్రీన్ షాట్లు, మార్కుల తేడాలు, పునఃమూల్యాంకన దరఖాస్తులను షేర్చేస్తూ, బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు.
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ దరఖాస్తు గడువును పొడిగించాలని ఈ సంస్థ పోర్టల్లోని లోపాలను బహిర్గతం చేసిన 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ విజ్ఞప్తి చేశారు. ‘మీ పోర్టల్లోని లోపాలను బహిర్గతం చేయడంలో బిజీగా ఉన్నాను. అందుకే రీవాల్యుయేషన్ గడువును పొడిగించండి’ అని అతడు సీబీఎస్ఈని ఎక్స్లో కోరాడు.
12వ తరగతి విద్యార్థులు వారి జవాబు పత్రాల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సీబీఎస్ఈ ఈ నెల 7న రాత్రి 11.59 వరకు గడువు పొడిగించింది. సీబీఎస్ఈ పోర్టల్లో తాను కనుగొన్న లోపాలపై నివేదికను ఈ నెల 2న సార్థక్ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమర్పించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభు త్వం సీబీఎస్ఈ చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేసింది. సార్థక్ చేసిన పనిని లోక్సభలో విపక్ష నేత రాహుల్ అభినందించారు.