Viral News | పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం బుధవారం గణితం పరీక్ష ఉంది. దీంతో మనీశ్ను పరీక్ష హాల్ వద్దకు అతని తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో ఎగ్జామ్కు టైం అవుతుండగా మనీశ్ పరీక్ష హాల్లోకి వెళ్లారు. అయితే, అక్కడ మొత్తం అమ్మాయిలే ఉండటంతో వారిని చూసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గమనించిన పాఠశాల యాజమాన్యం మనీశ్ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ పరీక్షహాల్లో 50 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు చెప్పారు.