కొత్తగూడెం క్రైం, మార్చి 3: ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఓ జవాన్, ఓ మావోయిస్టు మృతిచెందారు. కాంకేర్ జిల్లా పకంజూర్లోని హిటూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందని సమాచారం అందుకున్న బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ బలగాలు ఆదివారం సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు.
జవాన్లు ఆప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాలకు పైగా భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో రమేశ్ కురేటి అనే జవాన్ మృతదేహంతోపాటు ఓ మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించారు. మృతిచెందిన మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉన్నది.