న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. జూన్ 20 నుంచి ఇక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆయన ఈ దీక్షను ప్రారంభించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలసి రాజ్ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. వందలాది మంది యువకులు, విద్యార్థులు, రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్కు చెందిన రైతులను ఇక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని దీప్కే ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. దేశంలోని మొత్తం విద్యావ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తాము కోరుతున్నామని అన్నారు.