న్యూఢిల్లీ, ఆగస్టు 6: క్రిమినల్ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులకు నేరస్తుల నుంచి బెదిరింపులు వస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని, ఇది చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భాల్లో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోలు(ఐబీ) న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని వాపోయింది. తమకు వచ్చిన బెదిరింపులపై కనీసం అధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా జడ్జిలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య నేపథ్యంలో.. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల రక్షణ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విచారణకు హాజరయ్యారు.
ఎంతో బాధ్యతతో అంటున్నాను..
సీబీఐ తీరుపై జస్టిస్ రమణ విచారణ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘క్రిమినల్ కేసులు విచారిస్తున్న జడ్జిలకు బెదిరింపులు వచ్చిన ఒకటి రెండు ప్రాంతాల్లో కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఏడాది గడిచింది. సీబీఐ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఒక్క చోటనైతే అసలు దర్యాప్తునే ప్రారంభించలేదు. సీబీఐ తీరులో మార్పు వస్తుందని భావించాం. కానీ రాలేదు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. కానీ వాస్తవం ఇది’ అని జస్టిస్ రమణ అసహనం వ్యక్తం చేశారు. ‘దురదృష్టవశాత్తూ దేశంలో ఒక కొత్త పోకడ మొదలైంది. తమకు వచ్చిన బెదిరింపులపై జడ్జిలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు, సీబీఐ, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది తమకు ప్రాధాన్య అంశం కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థకు ఐటీ, సీబీఐ సాయం చేయడం లేదు. ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాటలు అంటున్నా. జడ్జిల ఫిర్యాదులను పట్టించుకోని ఘటనలు నాకు తెలుసు’ అని నొక్కి చెప్పారు. కోర్టు పరిసరాల్లో భద్రత ఏర్పాట్లపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరగా కేంద్రం ఇంతవరకు స్పం దించలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
17లోగా రాష్ర్టాలు నివేదిక ఇవ్వాలి
ఉత్తమ్ ఆనంద్ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్టు జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐకి కేసు అప్పగించి మీరు చేతులు దులుపుకొన్నారా?’ అని తీవ్రంగా ప్రశ్నించింది. జార్ఖండ్ జడ్జి హత్యపై సోమవారం విచారిస్తామని తెలిపింది. సీబీఐకి నోటీసులు జారీచేసింది. మరోవైపు న్యాయాధికారుల రక్షణకు ఏం చర్యలు తీసుకొన్నారో ఈ నెల 17లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలను ఆదేశించింది.