న్యూఢిల్లీ: న్యాయవాదులు ఎల్లవేళలా మంచికి అండగా చెడుకు వ్యతిరేకంగా నిలువాలని భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా-సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ( CJI Ramana ) చెప్పారు. ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని ఆయన వారిని కోరారు. చర్చకు అవకాశం కల్పించడం మన రాజ్యాంగ ముఖ్య లక్షణమన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు.
న్యాయవాదులు, న్యాయమూర్తులు ఒక పెద్ద కుటుంబంలో భాగమని జస్టిస్ రమణ చెప్పారు. న్యాయమూర్తులకు, న్యాయ వ్యవస్థకు సాయపడాలని న్యాయవాదులను కోరారు. మంచికి మద్దతివ్వడానికి, చెడును వ్యతిరేకించడానికి న్యాయవాదులు భయపడకూడదని, అయిష్టతను ప్రదర్శించరాదని సూచించారు. స్వాతంత్ర్య సమర యోధులకు, రాజ్యాంగసభ సభ్యులకు జస్టిస్ రమణ వందనం తెలియజేశారు. న్యాయవ్యవస్థలో భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నానని సీజేఐ పేర్కొన్నారు.