న్యూఢిల్లీ: సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన హైకోర్టు జడ్జిల సదస్సును సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీలను ఏడాదిలోపు భర్తీ చేయగలిగామని వెల్లడించారు. మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఇప్పటికీ ఖాళీలున్న హైకోర్టు సీజే పేర్లను పదోన్నతి కోసం పంపాలని కోరారు. ఏడాది కాలంలో సుప్రీంకోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు, హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని చెప్పారు. తనకు సహకరించిన కొలీజియం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సదస్సులో హైకోర్టు జడ్జిల నియామకం, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, జడ్జిల వేతనాలు, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు పెంచడంపై చర్చించారు. కాగా, శనివారం జరుగనున్న న్యాయ సదస్సుకు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకున్నారు. ఇందులో భాగంగా నేడు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు.