న్యూఢిల్లీ: వృత్తి నిర్వహణలో మంచి, చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ లాయర్లకు సూచించారు. తాను యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక క్లయింట్ ఫీజుకు బదులుగా తన తల్లికి చీరను బహుమతిగా ఇచ్చాడని ఆయన గుర్తు చేసుకున్నారు. జూనియర్గా పనిచేస్తున్నప్పుడు ఓ రాజకీయ నాయకుడు తానుంటున్న ఫ్లాట్కు వచ్చి చీరను తన తల్లికి బహుమతిగా అందజేశాడన్నారు. మరునాడు తాను ఆఫీస్కు వెళ్లినప్పుడు ఆ నాయకుడు బహుమతిగా ఇచ్చిన చీరే తన ఫీజు అని చెప్పి తన సీనియర్ తనను ఆశ్చర్యపరిచారన్నారు. అలాగే తాను మొదటిసారి ఈ కోర్టుకు వచ్చినప్పుడు గణ్పులే వద్ద సహాయకుడిగా ఉండేవాడినని, ఆ క్రమంలో ఒక క్లయింట్ నాకు మరిన్ని కేసులు ఇస్తానని వాగ్దానం చేశాడన్నారు. ఇదే విషయాన్ని తాను సీనియర్ వద్ద చెప్పగా ‘అలా ఎవరైనా క్లయింట్ చెబితే అతడు ఈ కేసుకు ఫీజు ఇవ్వడని అర్థం చేసుకో’ అని చెప్పి తన కళ్లు తెరిపించారని అన్నారు.