న్యూఢిల్లీ, మే 5: ఇప్పుడంటే స్కూల్లో టీచర్ల వద్ద బెత్తాలు కనిపించడం లేదు. విద్యార్థులను బెత్తం తో దండించడం ఇప్పుడు నేరం. కానీ దశాబ్దాల క్రితం ఇది చాలా సర్వసాధారణ విషయం. బెత్తం దెబ్బలు తినని విద్యార్థి ఉండేవాడు కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదట. శనివారం నేపాల్ సుప్రీంకోర్టు ‘జువైనల్ జస్టిస్’పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
స్కూల్లో ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఓ అసైన్మెంట్లో భాగంగా బొమ్మ తయారీ నేర్చుకుంటున్నప్పుడు సరైన సూదు లు తెచ్చులేక దెబ్బలు తిన్నట్టు ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పు డు తాను ఐదో తరగతి చదువుతున్నానని, ఆ ఘటన ఇప్పటికీ తనకు గుర్తుందని తెలిపారు. ‘చేతికి అయిన భౌతికగాయం మానిపోయింది. కానీ నా మనసుకు అయిన గాయం మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పటికీ ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది నాకు గుర్తొస్తుంది. ఇది పిల్లలపై లోతైన ప్రభావం చూపిస్తుంది’ అని పేర్కొన్నారు.