శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడ్ని బందిపోరా జిల్లాకు చెందిన మహ్మద్ ఇబ్రహీంగా గుర్తించారు. ఆ షాపు యజమాని కశ్మీరీ పండిట్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, గత 24 గంటల్లో శ్రీనగర్లో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం నగరంలోని బాట్మలూ ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో ఓ పోలీస్ మరణించినట్లు అధికారులు తెలిపారు.