న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో విబేధాలకు దిగిన పశుపతి కుమార్ పారస్కు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పేరును కేటాయించినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. పశుపతికి చెందిన పార్టీకి కుట్టు మిషన్ గుర్తును ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది. పార్టీ పేరు, గుర్తుల కోసం చిరాగ్, పశుపతి మధ్య కొన్నాళ్లుగా వైరం ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వాళ్లు ఇద్దరూ వేరుపడ్డారు కూడా. అయితే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చిరాగ్, పశుపతిలకు వేర్వేరు పార్టీ పేర్లు, గుర్తులను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
పార్టీ పేరు, గుర్తులపై చిరాగ్, పశుపతి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘం వాటిని సీజ్ చేసింది. బీహార్లోని కుశ్వేశ్వర్ ఆస్తాన, తారాపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఆ నిర్ణయం తీసుకున్నది. పార్టీ పేరును ఇద్దరు వాడరాదంటూ ఈసీ చెప్పింది. ఎల్జేపీ వాడే బంగ్లా సింబల్ను కూడా ఎవరూ వాడకూడదని శనివారం ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మూడు ఇతర గుర్తులను ఎన్నుకోవాలని రెండు వర్గాలకు ఈసీ సూచన చేసింది. దాని ప్రకారమే ఇవాళ కొత్త గుర్తులను ఈసీ ప్రకటించింది.