‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది? పేట పేటకూ చైనా బజార్.. ఇండియాలో వేర్ ఈజ్ భారత్ బజార్?’.. కేంద్రంలోని మోదీ సర్కారు తీరును ఎండగడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని తేలింది. మోదీ సర్కారు పాలనలో చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, జనవరి 11, (నమస్తే తెలంగాణ): భారత మార్కెట్ను చైనా వస్తువులు ముంచెత్తుతున్నాయి. ఆ దేశం నుంచి దిగుమతులు ఏటా భారీగా పెరుగుతున్నాయి. యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీయే హయాంలోనే దిగుమతులు భారీగా పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. దీంతో మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం కేవలం నినాదాలకే పరిమితమైందని, ఆచరణలో ఘోరంగా విఫలమైందని మరోసారి రుజువైంది.
37% పెరిగిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ దిగుమతి
2021తో పోలిస్తే 2022లో చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ యంత్రాల విడి భాగాల దిగుమతి 37 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి చైనా నుంచి చేసుకున్న దిగుమతుల విలువ 89 బిలియన్ డాలర్లు కాగా, డిసెంబర్ నాటికి అది 100 బిలియన్లు దాటింది. 2021 సెప్టెంబర్ నాటికి చైనా నుంచి 62 బిలియన్ల డాలర్ల విలువ చేసే వస్తువులను దిగుమతి చేసుకోగా, ఈ దిగుమతుల విలువ 2022 నాటికి 44 శాతం పెరిగింది. ఏ దేశంతోనైనా దిగుమతులు, ఎగుమతులు దాదాపు సరిసమానంగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది వ్యాపార సూత్రం. కానీ ఇందుకు భిన్నంగా భారత్ నుంచి చైనా చేసుకున్న దిగుమతుల కంటే, చైనా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ ఎక్కువ. జనవరి నుంచి సెప్టెంబర్ 2022 మధ్య చైనా నుంచి భారత్ మొత్తం దిగుమతుల విలువ 551 బిలియన్ డాలర్లు కాగా 2021లో ఇది 406 బిలియన్ డాలర్లు.
ప్లాస్టిక్ వస్తువుల దిగుమతి రెట్టింపు
2021 జనవరి-సెప్టెంబర్ వరకు మొత్తంగా చైనా నుంచి చేసుకున్న దిగుమతుల వాటా 15.3 శాతం ఉండగా, ఇదే కాలానికి (2022లో) దిగుమతుల వాటా 16.2 శాతంగా ఉన్నది. గత పది ఏండ్లలో (2011 నుంచి 2021 వరకు) చైనా నుంచి భారత్ చేసుకునే దిగుమతులు సంవత్సరానికి సగటున 4 శాతం పెరిగినట్టు యునైటెడ్ నేషన్స్ డాటాబేస్ విశ్లేషించింది. చైనా నుంచి ఇతర వస్తువుల కంటే ప్లాస్టిక్ వస్తువుల దిగుమతి ఏటేటా దాదాపు రెట్టింపు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 సంవత్సరంలో చైనా నుంచి ప్లాస్టిక్ వస్తువుల దిగుమతుల విలువ 2.7 బిలియన్లు కాగా ఇది 2022లో 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఆందోళనకర పరిణామం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనే చైనా నుంచి దిగుమతులు, వాణిజ్యం గణనీయంగా పెరగడం గమనార్హం. చైనాతో భారత్ వాణిజ్యం 2021లో 125.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో భారత్ దిగుమతులు 97.5 బిలియన్ డాలర్లు కాగా.. భారత్ నుంచి చైనాకు జరిగిన ఎగుమతులు 28.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది ఆందోళనకరమైన పరిణామంగా ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.