న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది. చైనాకు చెందిన కొన్ని హ్యాకింగ్ ముఠాలు విదేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ నేరాలకు పాల్పడినట్టు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో వెల్లడైంది. ఇండియా నుంచే కాక పలు దేశాల నుంచి చైనా హ్యాకర్లు కీలక సమాచారాన్ని దొంగిలించినట్టు కథనాలు ప్రచురితం కావటంతో కలకలం రేగింది. మన డాటా చోరీ చేసిన హ్యాకింగ్ సంస్థకు చైనా ప్రభుత్వం మద్దతున్నదని కథనంలో పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ సంస్థలకు చెందిన సాప్ట్వేర్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఈ సైబర్ దాడులకు పాల్పడినట్టు కథనం పేర్కొన్నది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ఐసూన్ కంపెనీకి చెందిన పత్రాలు లీకైనట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత వారం ఈ వివరాలు గిట్హబ్లో వెలుగు చూశాయి. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీగా సేవలందిస్తున్నది.