(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): భారత్-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొన్నది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భారత్ మీద దాడులు చేయడానికేనా అన్నట్టు చైనా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టింది. అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్లోని సలు ఎయిర్బేస్లలో అత్యాధునిక డ్రోన్లు, జెట్ విమానాలను మోహరించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ బయటపెట్టింది. సరిహద్దు నుంచి 150-260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు ఎయిర్బేస్లలో పదుల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లు, జెట్ విమానాలు ఉంచినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. అత్యాధునిక ‘డబ్ల్యూజెడ్-7 సోరింగ్ డ్రాగన్’ డ్రోన్లు, ఫ్లాంకర్ టైప్కి చెందిన సుఖోయ్-30ఎంకేఐ, జే10, కేజే-500 ఫైటర్ జెట్స్ను డ్రాగన్ సిద్ధం చేసింది. మాక్సర్ ఈ చిత్రాలను గత నెల 27 నుంచి ఈ నెల 14 తేదీల మధ్య తీసింది. అటు.. అరుణాచల్ సరిహద్దులో చైనా కదలికలు పెరగటంతో భారత నేవీ కూడా యుద్ధ విమానాలతో పెట్రోలింగ్ నిర్వహించింది.
ముప్పేట దాడికి..
ఈశాన్య భూభాగమే లక్ష్యంగా సరిహద్దులకు సమీపంగా చైనా ఈ యుద్ధ విమానాలను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తే తెలుస్తున్నది. ముఖ్యంగా అరుణాచల్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాంగ్డా ఎయిర్బేస్, సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిగాట్సే ఎయిర్బేస్తో పాటు సరిహద్దుకు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసా ఎయిర్బేస్లో చైనా పదుల సంఖ్యలో ఫైటర్ జెట్లు, డ్రోన్లను మోహరించింది. లాసాలో రెండో రన్వేను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను ప్రయోగిస్తే ఈశాన్య భూభాగాన్ని పూర్తిగా కవర్ చేయవచ్చని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.
ఆధిపత్యం కోసమే
ఈశాన్య ప్రాంతం వెంబడి ఉన్న మెక్మోహన్ రేఖ అలాగే, అక్సాయి చిన్పై ఆధిపత్యం కోసం ఉద్దేశించిన మిషన్లను మరింత ముందుకు తీసుకెళ్లడానికే చైనా సరిహద్దుల్లో ఈ విధంగా యుద్ధ విమానాలను, డ్రోన్లను మోహరిస్తున్నది.
-సమీర్ జోషి, ఐఏఎఫ్ మాజీ ఫైలట్
పసిగట్టేందుకే
వివాదాస్పద ప్రాంతాల్లో భారత సైన్యం కదలికలను పసిగట్టేందుకే చైనా ఈ స్థాయిలో డ్రోన్లను మోహరించినట్టు కనిపిస్తున్నది.
-సిమ్ టాక్, రక్షణరంగ నిపుణుడు