కోల్కతా, డిసెంబర్ 14: తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు. చైనా మాత్రం ఇందుకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ వద్ద ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటుకు ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాన్ని భారత సైనికులు అడ్డుకున్నప్పుడే ఘర్షణ జరిగిందని ఓ సైనికాధికారి వెల్లడించారు. శీతాకాలం సందర్భంగా భారత బలగాలు చేసుకుంటున్న ఏర్పాట్లు, కదలికలను తెలుసుకునేందుకు చైనా ఎల్ఏసీ వద్ద ఓపీ నిర్మించాలనుకుందని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని భారత సైనికులు చెప్పినా వినకపోవడంతో చైనా బలగాలను తరిమేశారని పేర్కొన్నారు.