China | న్యూఢిల్లీ, ఆగస్టు 29: చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. భారత్లోని అరుణాచల్ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ ‘స్టాండర్డ్ మ్యాప్-2023’ను విడుదల చేసింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్ని కూడా తమ భూభాగంగా చూపించింది. అరుణాచల్ను దక్షిణ టిబెట్గా డ్రాగన్ పేర్కొన్నది. తాజా ఎడిషన్లో 11 ప్రాంతాలకు పేర్లను మార్చింది. 2017లో 6, 2021లో 15 ప్రాంతాలకు పేర్లను ప్రకటిస్తూ మ్యాపులను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో అరుణాచల్లోని నదులు, పర్వతాలు, ఇతర ప్రాంతాలకు పేర్లను పెట్టింది. ఇదిలా ఉండగా, ఉత్తర లడఖ్లోని దేస్పాంగ్ మైదాన ప్రాంతాల్లో చైనా బంకర్లు నిర్మిస్తున్నది. ఆయుధాలు, మిలటరీ ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న శాటిలైట్ ఫొటోలు విడుదలయ్యాయి.
జీ20 సమావేశాల నేపథ్యంలో
కశ్మీర్లో భాగంగా ఉన్న అక్సాయిచిన్ 1962 యుద్ధం తర్వాత భారత్-చైనా మధ్య వివాదాస్పద ప్రాంతమైంది. మరికొద్దిరోజుల్లో జీ20 దేశాల సదస్సు న్యూఢిల్లీలో జరగనున్నది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్కు రాబోతున్నారు. ఇలాంటి తరుణంలో అరుణాచల్ సహా పలు భూభాగాలపై హక్కులు తమవేనంటూ చైనా మ్యాపులు విడుదల చేయటం భారత్కు మింగుడు పడని అంశం.
సముద్రంపైనా హక్కులు
ఒక్క భారత్తోనే కాదు, తైవాన్, జపాన్, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై దేశాలతో చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్ని తమవిగా చూపుకుంటూ ‘2023 ఎడిషన్ స్టాండర్డ్ మ్యాప్’ను చైనా విడుదల చేసింది. ముఖ్యంగా సముద్రంలోని దీవులు, అతిపెద్ద భూభాగం నైన్ డ్యాస్ లైన్ను మ్యాప్లో చూపటాన్ని బ్రూనై, తైవాన్, మలేషియా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
చైనాకు ఇది అలవాటుగా మారింది: ఎస్ జైశంకర్
భారత్ భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ చైనా అధికారికంగా మ్యాపుల్ని విడుదల చేయటాన్ని విదేశాంగమంత్రి జైశంకర్ ఖండించారు. మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ..‘చైనాకు ఇదంతా అలవాటుగా మారింది. ఇతర దేశాల భూభాగాలని తనవిగా చూపుకోవటం తప్ప చైనా చేయగలిగింది ఏమీ లేదు. మ్యాపులతో ఇతర దేశాల భూభాగాలపై హక్కులు కోరటం అసంబద్ధమైన వాదన’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉన్నాయి, ఇకముందూ ఉంటాయి అని స్పష్టం చేశారు.