న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ‘భారత సరిహద్దులోని గల్వాన్ లోయలో ఇంచు భూమిని కూడా వదిలేది లేదని స్పష్టం చేస్తూ చైనా ప్రజలకు సైనికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు’ అని కామెంట్ చేసింది. ఆ దేశ అధికార మీడియా ప్రతినిధి షెన్ షివీ కూడా ‘గల్వాన్ లోయలో చైనా జాతీయ జెండా ఎగిరింది. ఈ జాతీయ జెండా ఒకప్పుడు బీజింగ్లోని తియానన్మెన్ స్కేర్లోనూ ఎగిరింది, అందుకే ఇది ప్రత్యేకమైనది’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు విరుచుపడ్డాయి. ప్రధాని మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘గల్వాన్ లోయలో మువ్వన్నెల జెండా అందంగా కనిపిస్తుంది. చైనాకు దీటుగా బదులివ్వాలి. మోదీజీ.. మౌనం వీడండి’ అని ట్వీట్ చేశారు.