తిరుమలగిరి, జూలై 13:బోదకాలు (పైలేరియా) నులిపురుగుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ఈ నెల 15నుంచి 17వరకు జిల్లా వ్యాప్తంగా 2నుంచి 15ఏండ్లలోపు పిల్లలకు డీఈసీ మాత్రలతో పాటు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు జిల్లాలో 10,39,211మంది అర్హులను గుర్తించగా 4440మంది సిబ్బందితో పాటు 462మంది సూపర్వైజర్లను నియమించారు. ఇప్పటికే ఎన్వీబీడీసీపీ (జాతీయ కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగా) ఢిల్లీ సెంట్రల్ టీమ్ సభ్యుడు జయరామ్ పరాస మోతె, సిరికొండ, నాగారం, అర్వపల్లి మండలాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి ముందస్తు చర్యలను పరిశీలిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు…
గోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవాలి.
ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను ఉపయోగించాలి.
భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పిల్లలు చెప్పులు ధరించే వెళ్లేవిధంగా చూసుకోవాలి.
డీఈసీ మాత్రల ద్వారానే నివారణ సాధ్యం…
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 ,16,17 తేదీల్లో జరిగే డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం ఉచితంగా అందించే డీఈసీ మాత్రలను వైద్య సిబ్బంది సూచనల మేరకు వినియోగించాలి. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసేందుకు ఇంటికి వచ్చే వలంటీర్లకు ప్రజలంతా సహకరించాలి.