న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కేసు(covid cases)లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(DY Chandrachud) ఇవాళ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాయర్లు స్వేచ్చగా వర్చువల్ రీతిలో కోర్టుకు హాజరుకావచ్చు అని వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నట్లు వార్తపత్రికల్లో వస్తున్న కథనాలు స్పష్టం చేస్తున్నాయమని, ఒకవేళ లాయర్లు వర్చువల్ పద్ధతి(virtual mode)లో కోర్టుకు హాజరుకావాలనుకుంటే, అప్పుడు వాళ్లు ఆన్లైన్ విచారణ చేపట్టవచ్చు అన్నారు. హైబ్రిడ్ పద్ధతి(Hybrid mode)లో అంటే వీలైతే కోర్టు లేదంటే వర్చువల్గా కూడా విచారణలో పాల్గొనవచ్చు అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.