న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చాంబర్లో గురువారం ఉదయం ఓ ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ ఘటనకు చెందిన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఓ ఇంజినీరింగ్ విద్యార్ధినికి మార్చిలో పుట్టబోయే బిడ్డ గురించి ఆ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాలు పాటు సీజేఐ చంద్రచూడ్ .. మిగితా జడ్జిలు, అడ్వకేట్లతో మాట్లాడారు. 20 ఏళ్ల ప్రెగ్నంట్ అమ్మాయి అబార్షన్ కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. కానీ ఎయిమ్స్ నిపుణులు ఆమె విన్నపాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది.
జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ జేబీ పర్దివాలా ఈ కేసును విచారిస్తున్న సమయంలో.. సీజేఐ చంద్రచూడ్ జోక్యం చేసుకుని.. తన చాంబర్లోకి రావాలంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటిలను కోరారు. ఆ వెంటనే ధర్మాసనంలోని సభ్యులు సీజేఐ చాంబర్లోకి వెళ్లారు. సీజేఐ చాంబర్లో 40 నిమిషాల పాటు రహస్యంగా చర్చ జరిగింది. ముగ్గురు జడ్జీలు, ఎస్జీ మెహతా, ఏఎస్జీ భాటిలు తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు.
డిస్కషన్ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. తన అభిప్రాయాన్ని వినిపించారు. గతంలో ఓ సారి పిల్లల్ని దత్తత తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. అనాథలను దత్తత తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థినికి పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకునేందుకు ఓ జంట సిద్ధంగా ఉందని కూడా సీజేఐకి ఆయన వివరించారు. చాలా సున్నితమైన ఈ విషయం పట్ల సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ ఇద్దరు దివ్యాంగ అమ్మాయిల్ని దత్తత తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇంజినీరింగ్ స్టూడెంట్కు పుట్టబోయే ఆ బిడ్డ గురించి ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏఎస్జీ ఐశ్వర్య భాటి.. గత కొన్నాళ్ల నుంచి ఆ ప్రెగ్నెంట్ విద్యార్ధితో టచ్లో ఉన్నారు. ఒకవేళ అవసరమైతే, ఆ బిడ్డను తానే దత్తత తీసుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే తుషార్ మెహతా ఇచ్చిన సలహా మేరకు సుప్రీం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్న జంట ముందుగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కింద రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో.. బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆ విద్యార్ధిని అంగీకరించింది. గర్భానికి 29 వారాల దాటడం వల్లే ఆ పిండాన్ని తొలగించలేమని ఎయిమ్స్ వైద్యుల బృందం సుప్రీంకోర్టుకు ఈ కేసులో నివేదిక సమర్పించింది. కానీ ఆ విద్యార్ధిని మాత్రం కచ్చితం గర్భాన్ని తొలగించుకోవాలన్న ఆలోచనలో ఉంది. దీంతో సీజేఐ వ్యక్తిగతంగా ఆ కేసును తన చాంబర్లో డిస్కస్ చేసి పరిష్కరించారు.