న్యూఢిల్లీ : పలు రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రయాణీకుల రైళ్ల రద్దుపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. సరిపడా బొగ్గు నిల్వలు..భారీ రైల్వే నెట్వర్క్..సామర్ధ్యం మేర పనిచేయని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు..అయినా విద్యుత్ కొరత వెంటాడుతోంది. దీనికి మోదీ ప్రభుత్వాన్ని మనం నిందించరాదని..దీనికి 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనే కారణమని కేంద్ర ప్రభుత్వ తీరును చిదంబరం ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం విద్యుత్ సంక్షోభానికి సరైన పరిష్కారం కనుగొన్నదని, ప్రయాణీకుల రైళ్లను రద్దు చేసి బొగ్గు తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి బొగ్గు, రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖల చేతగానితనం ఏమీ లేదని ఈ శాఖలను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహించిన మంత్రులే అసమర్ధులని మోదీ సర్కార్పై చురకలు వేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొనడంతో పవర్ ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరాల కోసం 42 ప్రయాణీకుల రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. రైల్వేల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తి చేసే చత్తీస్ఘఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ప్రయాణీకుల రాకపోకలకు అసౌకర్యం నెలకొంది.