న్యూఢిల్లీ: అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంటే అత్యున్నతమైనదని పేర్కొన్నారు.
పార్లమెంటులో మెజారిటీతో పార్లమెంటరీ వ్యవస్థను మార్చి అధ్యక్ష వ్యవస్థను తీసుకువస్తే చెల్లుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఏడో షెడ్యూల్లోని రాష్ర్టాల జాబితాను మార్చి వాటి శాసనాధికారాలను తీసుకుంటే సమ్మతమేనా అని అడిగారు. మెజారిటీతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కోర్టుల తీరును ధన్కర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.