పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనేది రైతుల విజయం విస్పష్ట సంకేతాలు పంపిందని సాగు చట్టాల రద్దుపై చిదంబరం వ్యాఖ్యానించారు. మోదీ ప్రజాస్వామ్య ముసుగులో నియంతలా వ్యవహరిస్తారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇటీవల పెట్రో ధరలు తగ్గించిన తరహాలోనే రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాల రద్దును ప్రకటించారని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, పార్లమెంట్కు భయపడదని, ఎన్నికల్లో ఓటమికే భయపడుతుందని ప్రజలకు తెలిసివచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచాలని ఎవరైనా అనుకుంటే ప్రతి ఎన్నికల్లో పాలక పక్షానికి గుణపాఠం నేర్పాలని చిదంబరం పిలుపు ఇచ్చారు.