Elections | భోపాల్, నవంబర్ 16: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లో మొత్తం 5.6 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు కాగా, పురుష ఓటర్లు 2.88 కోట్లు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 22.36 లక్షల మంది యువతీయువకులు మొదటిసారిగా తమ ఓటుహక్కును వినియోగించబోతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో కూడిన అసెంబ్లీ స్థానాలు 150 వరకు ఉండటంతో రైతుల ఓట్లు కీలకంగా మారాయని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో శుక్రవారం రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మిగిలిన 70 స్థానాల్లో సీఎం భూపేశ్ బఘేల్ సర్కార్పై ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. రెండో దశ పోలింగ్లో సీఎం భూపేష్ బఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింఘ్దేవ్, మరో 8మంది మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలున్నాయి. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7న మొదట దశలో 20 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మునుపెన్నడూ లేనంతగా రికార్డ్స్థాయిలో 78 శాతం ఓటింగ్ నమోదైంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. మొత్తం 22 జిల్లాల్లో విస్తరించిన 70 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1.63 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారు. ఇందుకోసం మొత్తం 18,833 పోలింగ్ బూత్లను ఏర్పాటుచేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామ్ దయాళ్ యూకీ వాహనంలో రూ.11.50 లక్షల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కోర్బా జిల్లాలోని పాలి-తనఖార్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సోదాల సమయంలో ఈ వాహనంలో ఆయన ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఝుంకిడి గ్రామం సమీపంలో స్థానికులు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఆయన కారును అడ్డగించి, పసన్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారని కోర్బా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. నగదుతోపాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు లభించక రెబల్స్గా రంగంలోకి దిగిన నేతలను బీజేపీ అగ్ర నేతలు బుజ్జగించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగినా 25 మందికి పైగా రెబల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం వసుంధరా రాజే వర్గానికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం లభించక పోవటంతో.. వారిలో చాలా మంది అధిష్ఠానానికి బుద్ధి చెబుతామంటూ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. రెబల్స్గా పోటీ చేస్తున్న ప్రముఖుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రభాన్ సింగ్, కైలాశ్ మేఘ్వాల్ , దూడీకి ఖాన్, ఆక్య రజ్వీ తదితరులు ఉన్నారు.