రాయ్పూర్, ఏప్రిల్ 29: గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమలం పార్టీకి అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తున్నది. రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈనెల 19, 26 తేదీల్లో జరిగిన రెండు దశల్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. వచ్చే నెల 7న రాయ్పూర్, దుర్గ్, బిలాస్పూర్ సహా మిగిలిన ఏడు స్థానాల్లో ఓటింగ్ జరుగనున్నది.
అంతర్గత పోరుతో కాంగ్రెస్ సతమతం
గత ఏడాది ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయన విషయం తెలిసిందే. బఘేల్ సర్కారును గద్దె దించిన బీజేపీ.. విష్ణుదేవ్ సాయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్కు అంతర్గత పోరు, సీనియర్ నేతల మధ్య విభేదాలు ఇబ్బందికరంగా మారాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి.. పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీలో కనిపించని బలమైన నేత
రాష్ట్ర బీజేపీ ప్రధానంగా మోదీ చరిష్మా, తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను నమ్ముకొన్నది. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 10, 9 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి 11 స్థానాలనూ కైవసం చేసుకోవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకొన్నది. కేవలం మోదీ పాపులారిటీపైనే ఆధారపడుతున్న రాష్ట్ర బీజేపీలో బలమైన, ప్రముఖ నేత ఎవరూ కనిపించకపోవడం ఆ పార్టీకి కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నది. మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాల్లో బీజేపీ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అయితే రాష్ట్రంలోని గత బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ఆ పార్టీ సీనియర్ల మధ్య విభేదాలు బీజేపీ కలిసొచ్చే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.
గత లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇలా