కొత్తగూడెం ప్రగతి మైదానం, జనవరి 16: మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర యుద్ధంతో దండకారణ్యం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య జరిగిన పోరులో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా పూజారీ కాంకేర్ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల డీఆర్జీ జవాన్లతోపాటు కోబ్రా, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 1,500 మంది బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ చేపట్టారు.
ఈ క్రమంలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు దానిని అడ్డుకునేందుకు పావులు కదిపారు. ఇందులో భాగంగానే మూడు జిల్లాలకు చెందిన భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్పుర్-పూజారీ కాంకేర్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండున్నర గంటలపాటు భీకర పోరు జరిగినట్లు తెలుస్తున్నది. నలువైపులా చుట్టుముట్టిన జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు.
కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టారు. కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్లుగా తెలుస్తున్నది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్, 12 బోర్ తుపాకీ, రెండు సింగిల్ షాట్ తుపాకులు, ఒక బీజీఎల్ లాంచర్, నాటు తుపాకీతోపాటు మందుగుండు, ఇతర వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. ఎన్కౌంటర్ ఘటనతో ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ ఏజెన్సీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తమై అడవులను జల్లెడ పడుతున్నాయి.
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలైన ఘటన బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జవాన్లు చప్టా మీదకు రాగానే దాని కింద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.మరోవైపు మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ కేర్లపాల్(దర్భా డివిజన్ కమిటీ)కి చెందిన ఏరియా కమిటీ సభ్యురాలు కలుము పాయి పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి చెంది పోలీసుల ఎదుట లొంగిపోయారు.