బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ప్రధాని మోదీపై విపక్షాలు విమర్శల దాడి తీవ్రతరం చేశాయి. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను నమ్ముకునే కాషాయ పార్టీ బరిలో దిగిందని, మోదీ సైతం ప్రచారంలో సర్వం తానై పార్టీని నడిపించారని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఎదురవగానే సీఎం బసవ్రాజ్ బొమ్మైని బలిపశువును చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటమి బాధ్యత తనదే అని సీఎం బొమ్మై ప్రకటించడాన్ని భూపేష్ బఘేల్ ఆక్షేపించారు. ప్రచార భారాన్ని తలకెత్తుకుని కాషాయ దళాన్ని ముందుండి నడిపించిన ప్రధాని మోదీయే ఓటమికి బాధ్యత వహించాలని అన్నారు.
కర్నాటకలో బీజేపీ మట్టికరవడంతో దక్షిణాది నుంచి ఆ పార్టీ కనుమరుగైనట్టేనని విపక్షాలు వ్యాఖ్యానించాయి. మరోవైపు కర్నాటకలో (karnataka polls) కాంగ్రెస్ ఘన విజయంతో మోదీ వేవ్ ముగిసిందని, భజరంగ్ బలి కాంగ్రెస్ వైపు ఉన్నట్టు స్పష్టమైందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బజరంగ్ బలి గధ బీజేపీపై పడిందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభ మసకబారిందని, ఇక తమ వేవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ సర్కార్ను సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం కానున్నామని చెప్పారు.
రానున్న సార్వత్రిక సమరానికి ఇక సంసిద్ధమవుతామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల ఓటమిగా అంతకుముందు సంజయ్ రౌత్ అభివర్ణించారు. హనుమాన్, ప్రధాని మోదీ ఇమేజ్లను ట్వీట్ చేసిన రౌత్ హనుమాన్ ఫొటోపై భజరంగ్బలి 130+ స్ధానాలు అని, ప్రధాని మోదీ ఇమేజ్పై భజరంగ్దళ్ 60+ స్ధానాలని రాసుకొచ్చారు. నియంత పోకడలను ప్రజలు నిలువరించగలరని కర్నాటక ప్రజలు స్పష్టం చేశారని రౌత్ అన్నారు.
Read More