Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నదులు, చెరువుల్లోకి దిగి సూర్య భగవానుడికి పూజలు చేశారు. ఛట్ దేవత, సూర్య భగవానుడికి నైవేద్యాలు సమర్పించారు. నీటిలో నిలబడి తమ కుటుంబీకుల ఆరోగ్యం, సంపద, ఉద్యోగాల కోసం కోరికలు విన్నవిస్తుంటారు.
నేపాల్లోని కొండ ప్రాంతాలలో ఛట్ పండుగను జరుపుకునే ధోరణి అక్కడి నుంచి ఇక్కడ ప్రారంభమైందని చెప్తుంటారు. ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఛట్ పూజను నాలుగు రోజులపాటు జరుపుతారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్ఖాయ్ ఆచరిస్తారు.
నాలుగు రోజుల పాటు ఛత్ పూజలు జరుపుతారు. చివరి రోజైన కార్తీక మాసం సోమవారం నాడు సూర్యోదయానికి ముందే నీటి కొలనులు, నదుల్లోకి దిగి ఛత్ మాతతో పాటు సూర్యుడిని పూజలు చేస్తారు. పాట్నా కాలేజీ ఘాట్ వద్ద గంగా నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ఛత్ మాతతోపాటు సూర్యుడికి పూజలు చేశారు.
ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన తమకు అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. గోరఖ్పూర్లో భక్తులు ప్రార్థనలు చేయడానికి రప్తి నది ఘాట్కు తరలివచ్చారు. పిల్లలు, భర్త, కుటుంబం శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటామని రప్తి నది ఘాట్ వద్ద భక్తురాలు రేణు దేవి చెప్పారు.