గౌహతి: సినిమా అవార్డు గ్రహీతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అస్సాంలో సోమవారం ఆ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక జరిగింది. అస్సాం స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ASFFDC) దీనిని నిర్వహించింది. ఆ రాష్ట్ర సినీ పరిశ్రమకు చెందిన పలువురికి అవార్డులతోపాటు చెక్కులు అందజేశారు.
కాగా, తొమ్మిది మంది సినీ రంగ ప్రముఖులు తమకు ఇచ్చిన చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేశారు. వీటిలో ఎనిమిది మందికి చెందిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. శుక్రవారం ఆయా బ్యాంకులు ఆ చెక్కులను వారికి తిరిగి ఇచ్చారు. దీంతో వారంతా షాక్ అయ్యారు. ‘నేను శుక్రవారం చెక్కును డిపాజిట్ చేశాను. అది బౌన్స్ అయిందని బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అవార్డు నిర్వాహకులకు ఫోన్ చేశాను. తగినంత బ్యాలెన్స్ లేదని వారు చెప్పారు’ అని అపరాజిత పూజారి మీడియాకు తెలిపారు. 2018కి గానూ ఉత్తమ రచయిత అవార్డును ఆమె గెలుచుకున్నారు.
సినిమా అవార్డులు అందుకున్న అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చాంగ్మై (సౌండ్ మిక్సింగ్), ప్రాంజల్ దేకా (దర్శకత్వం), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్), బెంజమిన్ డైమరీ (నటన) వంటి ఇతర ప్రముఖులకు అందజేసిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి.
మరోవైపు అస్సాం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా స్పందించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చెక్కులు బౌన్స్ అయిన సినీ ప్రముఖులకు నిర్వాహకులు శనివారం ఫోన్లు చేశారు. మరోసారి బ్యాంకులో వేయాలని, ఈసారి అవి క్లియర్ అవుతాయని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అయినట్లు వెల్లడించారు.
Also Read: