Cheetah Tejas | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చిరుతల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు చిరుతలు మృతి చెందగా.. తాజాగా ‘తేజస్’ పేరు గల మగ చిరుత మృతి చెందినట్లు సమాచారం. మానిటరింగ్ బృందం చిరుత మెడ భాగంలో గాయం గుర్తులను గమనించి.. పాల్పూర్ ప్రధాన కార్యాలయంలోని వన్యప్రాణి విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే.. మృతి చెందినట్లు సమాచారం. చిరుత మృతితో మెడపై గాయాలు ఎక్కడ? ఎలా అయ్యాయి? అనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
తేజస్ను పోస్టుమార్టానికి తరలించామని, ఆ తర్వాత మృతికి గల కారణాలు తెలియజేయనున్నట్లు కునో డీఎఫ్ఓ పీకే వర్మ తెలిపారు. ప్రస్తుతం చిరుత మృతిపై విచారణ కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్కు తరలించింది. ఇందులో ఇప్పటి వరకు నాలుగు చిరుతలు, మరో మూడు పిల్లలు మృతి చెందాయి. మార్చి 27న సాషా అనే ఆడ చిరుత కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించింది.
ఆ తర్వాత ఏప్రిల్ 23న ఉదయ్ అనే మగ చిరుత కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్తో, మే 9న దక్ష అనే ఆడ చిరుత సంభోగం సమయంలో గాయపడి మరణించింది. మేలో మూడు చిరుత పులి పిల్లలు మరణించాయి. అయితే, కునోలో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిరుతలు వరుసగా మరణిస్తుండడంతో ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ విషయంలో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. చిరుతల మరణంతో ప్రాజెక్టులో ఎలాంటి లోపం లేదంటూ కేంద్రం ఖండించింది.