న్యూఢిల్లీ, మార్చి 12: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డు కొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ చేతులు కలిపింది. అధీకృత సమాచారాన్ని మాత్రమే అందించడంతోపాటు కృత్రిమ మేధ ఆధారంగా జెనరేట్ చేసిన డాటాకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి, ఓటు ఎలా వేయాలి వంటి కీలక ఎన్నికల సమాచారాన్ని తమ బ్రౌజర్లో యూజర్లు సులువుగా తెలుసుకునేందుకు ఈసీతో జట్టు కట్టామని, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుందని తెలిపింది.
కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఎక్కువ మంది ఏఐని వినియోగిస్తున్న నేపథ్యంలో, ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వివరించింది. యూట్యూబ్లో ఏఐ ఫీచర్లతో రూపొందించిన వీడియోలకు ఇప్పటికే లేబులింగ్ వేయడం ప్రారంభించామని తెలిపింది. గూగుల్కు చెందిన ఏఐ జెమిని విషయంలోనూ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపింది.