చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పేరును ఫిబ్రవరి 6న వెల్లడిస్తారని రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ గురువారం వెల్లడించారు. సీఎం అభ్యర్ధిత్వం కోసం చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 6న కాంగ్రెస్ పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవరనేది ప్రకటిస్తారని, తాను ఆరోజు కాంగ్రెస్ నేత రాహుల్ వెంట ఉంటానని సీఎం చన్నీ తెలిపారు. పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ప్రతిపాదించినా తాను మద్దతిస్తానని చన్నీ చెప్పుకొచ్చారు. సీఎం అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాలన్న పంజాబీల డిమాండ్ను నెరవేరుస్తున్నందుకు రాహుల్ గాంధీకి తాను ధన్యవాదాలు చెబుతున్నానని చన్నీ ట్వీట్ చేశారు.
పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా సమర్ధిస్తామని, పంజాబీల ఉన్నతికి పాటుపడతామని హామీ ఇస్తున్నామని అన్నారు. పార్టీ నాయకత్వం ప్రకటించే సీఎం అభ్యర్ధి కోసం ముందుగా తానే ప్రచారం చేస్తానని చెప్పారు. పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఎలాంటి సంకేతాలు పంపకపోయినా సీఎం చన్నీ చంకౌర్ సాహిబ్తో పాటు బదౌర్లోనూ నామినేషన్ వేయడంతో చన్నీ వైపే అధిష్టానం మొగ్గుచూపిందనే ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు సిద్ధూ సైతం సీఎం అభ్యర్ధిత్వంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక సీఎం అభ్యర్ధి ఎవరనేది పెద్ద విషయం కాదని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ వ్యాఖ్యానించారు.
సిద్ధూ ఎప్పటికీ హీరో అని, ఆయన హీరోగానే ఉంటారని, సీఎం అభ్యర్ధిగా ఎవరు ఉంటారనేది విషయం కాదని పేర్కొన్నారు. సీఎం ఎవరైనా మంత్రుల మాట వినాలని, వారి ఫైల్స్పై సంతకాలు చేస్తూ వారిని పనిచేసుకోనివ్వాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఫంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకోవాలని పాలక కాంగ్రెస్ చెమటోడుస్తుండగా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇక కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పార్టీతో జట్టుకట్టిన కాషాయ పార్టీ పంజాబీల ఆదరణను చూరగొనాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.