చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శనివారం వేల సంఖ్యలో చండీగఢ్కు తరలివెళ్లారు. కేంద్ర పాలిత ప్రాంతంమైన చండీగఢ్లోకి వారు ప్రవేశించకుండా మొహాలీ-చండీగఢ్ సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పంజాబ్ రైతులు తొలగించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొంత గందరగోళం నెలకొన్నది. అయితే చండీగఢ్లోకి ప్రవేశించిన పంజాబ్ రైతులను రాజ్భవన్ వైపు వెళ్లకుండా రెండు కిలో మీటర్ల దూరంలో పోలీసులు అడ్డుకున్నారు.
మరి కొన్ని చోట్ల నీటి ఫిరంగులతో రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రైతులు ట్రాక్టర్ల సహాయంతో చండీగఢ్లోకి ప్రవేశించారు. పంజాబ్ గవర్నర్ అధికారి ఒకరు అక్కడకు వచ్చి రైతుల వినతి పత్రాలను తీసుకున్నారు. దీంతో చాలా మంది రైతులు వెనక్కి తగ్గారు. హర్యానా రైతులను చండీగఢ్ సరిహద్దులోని పంచకుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హర్యానా గవర్నర్ కార్యాలయం అధికారి రైతుల వినతి పత్రాన్ని అక్కడ స్వీకరించారు. కాగా ఈ పరిణామాలతో చండీగఢ్లో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.