సరిగ్గా ఎన్నికల ముందు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రతిపక్షాలన్నీ ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం చెన్నీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నీ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోచవచ్చు. పంజాబ్లోకి యూపీ, బిహార్ వారిని చొరనివ్వం అంటూ సీఎం చెన్నీసంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం దుమారంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో ముఖ్యమంత్రి చెన్నీ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘దుర్గేశ్ పాఠక్, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్… వీరిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యలవి. బయటి నుంచి వచ్చి, పంజాబ్లో చిచ్చు పెట్టే వారి గురించి మాత్రమే అలా వ్యాఖ్యానించా. నిన్నటి నుంచి నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. పంజాబ్ అభివృద్ధి కోసం రక్తాన్ని, చెమటను చిందించిన వారి విషయంలో మా ప్రేమ అలాగే వుంటుంది. మా హృదయాల్లోంచి వారిని ఎవ్వరూ తీయలేరు’ అంటూ సీఎం చెన్నీ ప్రకటించారు.
కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోదీ
సీఎం చెన్నీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విమర్శలు చేశారు. సంత్ రవిదాస్ యూపీలో జన్మించారు. ఆయన్ను పంజాబ్ నుంచి వేరుచేస్తారా? గురు గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారు? ఆయన జన్మించింది పాట్నాలో. మీరేమో బిహార్ ప్రజలను పంజాబ్లోకి రానివ్వమంటారు. గురు గోవింద్ సింగ్ను మీరు అవమానిస్తున్నారా? అంటూ మోదీ సూటిగా ప్రశ్నించారు.
పంజాబీలు పాలించాలన్నదే ఆయన వ్యాఖ్యల ఉద్దేశం : ప్రియాంక
సీఎం చెన్నీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పంజాబీలే పంజాబ్ను పాలించాలన్నది ఆయన వ్యాఖ్యల్లో వున్న మర్మమని ప్రియాంక వివరించారు. యూపీ నుంచి వచ్చి, పంజాబ్ను పాలించాలని ఎవరూ అనుకోరని తాను భావిస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు : సీఎం కేజ్రీవాల్
సీఎం చెన్నీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం చెన్నీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని విరుచుకుపడ్డారు. స్వయంగా వారి పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీయే యూపీ నుంచి ప్రచారం చేయడానికి వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, తాము ఖండిస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
షాక్కు గురయ్యా : సీఎం నితీశ్ కుమార్
సీఎం చెన్నీ చేసిన వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ఆయనవి అర్థం పర్థం లేని మాటలని కొట్టిపారేశారు. పంజాబ్లో బిహార్ ప్రజలు ఎంతగా కష్టపడి, ఆ రాష్ట్రానికి సేవ చేస్తున్నారో సీఎం చెన్నీకి తెలుసా? అని నిలదీశారు. అసలు పంజాబ్లో బిహారీలు ఎంత మంది వుంటున్నారో ఆయనకు తెలుసా? అంటూ నితీశ్ ఎద్దేవా చేశారు.