Chandrababu | స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముయనుంది. ఈ నెల 11న అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 22వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే రిమాండ్ను మరో రెండు రోజులపాటు పొడిగిస్తూ కోర్టు శుక్రవారం తీర్పువెలువరించింది. ఆదివారం సాయంత్రంతో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ విచారణ రెండో రోజు కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగుస్తుంది. అనంతరం విచారణకు సంబంధించిన పూర్తి వీడియోను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు రిమాండ్, కస్టడీ విషయమై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
కస్టడీలో భాగంగా సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది అధికారుల బృందం.. తొలిరోజైన శనివారం చంద్రబాబును 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తున్నది. మొత్తంగా 120 ప్రశ్నలతో అధికారులు ప్రశ్నావలిని తయారు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణలో భాగంగా చంద్రబాబుకు ప్రతి గంటకు 5 నిమిషాలపాటు విరామం ఇస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇస్తున్నారు.