న్యూఢిల్లీ : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపధ్యంలో నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ ఈ నిర్ణయంపై స్పందించారు. దేశాన్ని కాపాడేందుకు నేతాజీ సిద్ధాంతాలను అమలు చేయాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా విభజిత, మతపరమైన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడాన్ని తాము స్వాగతిస్తున్నామని చంద్రకుమార్ బోస్ పేర్కొన్నారు.
అయితే మీరు ఆయనను నిజంగా గౌరవించాలనుకుంటే అన్ని కులాలు, మతాలను ఏకం చేసే ఆయన సిద్ధాంతాలను అమలు చేయాలని కేంద్ర పాలకులకు విజ్ఞప్తి చేశారు. దేశం నేతాజీకి రుణపడి ఉందని, ఆయన భారీ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద నెలకొల్పుతామని అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారీ నేతాజీ విగ్రహం సిద్ధమయ్యే లోగా జనవరి 23న ఆయన హాలోగ్రాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. మరోవైపు నేతాజీ విగ్రహ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ స్వాగతించారు.