అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయనను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు విచారించింది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో సుమారు ఆరు గంటలపాటు సీఐడీ చంద్రబాబును ప్రశ్నించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కాగా, చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. శని, ఆది వారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు విచారించాలని, గంటకు ఒకసారి 5 నిమిషాల చొప్పున ఆయన తన న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు సూచించారు.
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని హిమబిందు స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.