సుల్తాన్బజార్, ఫిబ్రవరి 23: సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆశ వర్కర్లు నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీవ్ర నిర్బంధాల మధ్య ఆశలు కోఠి కమిషనర్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆశ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆశ కార్యకర్తలను పోలీసులు వ్యాన్లలోకి ఈడ్చిపడేశారు. అంతకుముందు జిల్లాల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా కార్యక్రమానికి రాకుండా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షురాలు పోతురాజు జయలక్ష్మి మాట్లాడుతూ జనవరి నెల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని, 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సరిప డా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు.
తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పీ గంగామణి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్, సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా అ ధ్యక్షురాలు మీనా, సీఐటీయూ మేడ్చల్ జిల్లా నాయకులు రాజశేఖర్, యూనియన్ ఆఫీస్ బేరర్స్ రాష్ట్ర నాయకురాళ్లు యాదమ్మ, పద్మ, శ్రీలత, సునీత, కొండా లక్ష్మి, రేవతి, శోభ, స్వ రూప, లత, సుజాత, బాలమణి పాల్గొన్నారు.
ఆశ కార్యకర్తలపై ప్రభుత్వ తీరు అమానుషమని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులకు గురవుతున్న ఆశ కార్యకర్తలు ఆందోళనకు దిగితే అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తే నిర్బంధం విధించడమేంటని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పీఆర్సీ అమలు, బకాయి పడ్డ ఐదు కరువు భత్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.