తన్యూఢిల్లీ, జనవరి 8: రెండు జాతీయ పార్టీల ప్రతిష్ఠకు పరీక్ష.. నలుగురు నేతల నాయకత్వ పటిమ, చతురతకు సవాల్.. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలకు రెఫరెండం.. మూడు ప్రాంతీయ పార్టీల శక్తికి టెస్టు.. ఓ పార్టీకి జీవన్మరణ సమస్య.. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం ఇది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ర్టాల్లో ఈసారి జరుగుతున్న ఎన్నికలకు జాతీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఐదింటిలో నాలుగుచోట్ల బీజేపీనే అధికారంలో ఉన్నది. వీటిలో ఒక్కటి ఓడినా ప్రధాని మోదీ పాలనపైనా, కేంద్రప్రభుత్వ ఆర్థిక విధానాలపైనా దాని ప్రభావం కనిపిస్తుంది. పంజాబ్లో అధికారం నిలుపుకోవటంతోపాటు ఇతర రాష్ర్టాల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడం అత్యవసరంగా మారింది.
కాంగ్రెస్, బీజేపీ ఆత్మరక్షణ
కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్పైనే దేశం దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతమున్న 52 లోక్సభ సీట్లలో 11 పంజాబ్ నుంచే ఉన్నాయి. బీజేపీకి ఉన్న 301 స్థానాల్లో 62 ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు లేకపోవటం విశేషం. ఉత్తరప్రదేశ్లో బీజేపీని సమాజ్వాదీపార్టీ ఢీకొంటుండగా, పంజాబ్లో కాంగ్రెస్ను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎదుర్కొంటున్నది. దీంతో పంజాబ్లో ఆప్కంటే బలంగా మారేందుకు బీజేపీ, యూపీలో ఎస్పీకంటే ముందు వరుసలో నిలిచేందుకు కాంగ్రెస్ పోరాడుతున్నాయి.
మత మైనారిటీల సమస్య
పంజాబ్లో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఒకప్పుడు చక్రం తిప్పిన యూపీలో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నది. యూపీలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించింది 6 శాతం ఓట్లే. బీజేపీపై మైనారిటీలకు అంతగా విశ్వాసం లేదన్నది నిర్వివాదాంశం. పంజాబ్లో అత్యధికంగా ఉన్న సిక్కులపై కూడా ఆ పార్టీ మనస్ఫూర్తిగా స్పందించిన దాఖలాలు లేవు. పంజాబ్ సిక్కుల్లో ఎక్కువమంది రైతులే. సాగు చట్టాల రద్దుకు, బీజేపీకి వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమ ప్రభావం ఇంకా బలంగా ఉంది. కాంగ్రెస్కు మైనారిటీల్లో మంచి పట్టు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. గత ఏడేండ్లుగా ఆయా రాష్ర్టాల్లో మతపరంగా ప్రజల్లో స్పష్టమైన విభజన రావటంతో మైనారిటీల్లో కాంగ్రెస్ ప్రాభవం తగ్గిపోయింది. గోవాలో మూడో అతిపెద్ద మత సమూహమైన క్యాథలిక్స్ను ఆకట్టుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
నాయకత్వంపై ప్రశ్నలు
యూపీలో ఈసారి కూడా బీజేపీ గెలిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో ప్రధాని మోదీకి వారసుడిగా అవతరించే అవకాశం ఉన్నది. బీజేపీలోని ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన ఇప్పటికే మోదీ నీడనుంచి బయటపడి హిందూ నాయకుడిగా సొంత ఇమేజ్ సంపాదించుకొన్నారు. ఇటీవల యూపీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు యూపీలో కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చేందుకు గాంధీల వారసురాలు ప్రియాంకా వాద్రా శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారు. పంజాబ్పై కూడా ఆమె ప్రభావం కనిపిస్తున్నది. ఇటీవల ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంకే. ఇప్పుడు యూపీ, పంజాబ్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో ఆమె నాయకత్వానికి పరీక్షగా మారాయి. ఈ రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆ పార్టీలో నాయకత్వం కోసం జరుగుతున్న చర్చలో ప్రియాంక పేరు ప్రముఖంగా వినిపించటం ఖాయం.
బీజేపీపై కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ ఆశలు
ఈ ఎన్నికల ద్వారా దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెసేతర ప్రత్యామ్నాయంగా అవతరించాలని ఆప్, తృణమూల్ కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గత ఎన్నికల్లో పంజాబ్లో రెండో అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచింది. ఈ ఎన్నికల్లో అక్కడ అధికారం సాధించటంద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రముఖస్థానం సంపాదించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. మరోవైపు బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ చిన్నరాష్ట్రం గోవాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కూడా టీఎంసీ ప్రభావంచూపగల పార్టీగానే ఉన్నది. అలాగే గోవాలో ఆప్కు మంచి పట్టున్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ నేతలుగా ఎదిగేందుకు ఈ ఇద్దరు సీఎంలు రాజకీయాలు నడుపుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు పరీక్ష
యూపీ, పంజాబ్లో ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. యూపీలో బీజేపీని ఎదురొడ్డి నిలువగల ప్రాంతీయ పార్టీగా ఎస్పీ గుర్తింపు పొందుతున్నది. ఈ పార్టీకి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఓబీసీలే ఇంతకాలం వెన్నెముకగా ఉంటూ వచ్చారు. 2017 ఎన్నికల్లో ఆ ఓబీసీ ఓటుబ్యాంకును బీజేపీ తనవైపుకు తిప్పుకోవటంద్వారానే ఘనవిజయం సాధించింది. కాగా, పంజాబ్లో సిక్కు మైనారిటీలే లక్ష్యంగా శిరోమణి అకాలీదళ్ ఈసారి కూడా బరిలోకి దిగుతున్నది. మరోవైపు ఈ రాష్ర్టాల్లో దళిత ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. యూపీలో గతంలో ఏకఛత్రాధిపత్యం బీఎస్పీని ఈసారి ఎన్నికల్లో ఎవరూ పోటీదారుగా పరిగణనలోకి తీసుకోవటంలేదు. బీఎస్పీకి మొదటినుంచీ వెన్నుదన్నుగా నిలిచిన యూపీ దళితులు గత ఎన్నికల్లో బీజేపీవైపు మొగ్గారు. పంజాబ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. ఈసారి కూడా ఆ ఓటుబ్యాంకును కాపాడుకొనేందుకు దళితుడైన చరణ్జిత్సింగ్ చన్నీని సీఎంగా కాంగ్రెస్ ఇటీవలే నియమించింది. తమతమ దళిత ఓటుబ్యాంకును నిలుపుకొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి.