న్యూఢిల్లీ: నిర్దేశిత కాలపరిమితికి మించి డిప్యుటేషన్పై ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలని, కాలపరిమితి మించిన తర్వాత డిప్యుటేషన్పై ఉద్యోగులు కొనసాగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించింది.
డిప్యుటేషన్ ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్న కాలాన్ని క్రమబద్దీకరించాలని ఉద్యోగుల నుంచి వస్తున్న దరఖాస్తుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారి డిప్యుటేషన్ కాలపరిమితి పూర్తి కావడానికి ముందే పొడిగిస్తున్నట్టు రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప డిప్యుటేషన్పై కొనసాగవద్దని, ఇలా ఉంటే రిలీవ్ అయినట్టే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాలపరిమితి దాటినా డిప్యుటేషన్పై కొనసాగే కాలాన్ని సర్వీసుగా పరిగణించమని, పింఛను, ఇంక్రిమెంటు లోనూ ఈ కాలాన్ని లెక్కలోకి తీసుకోమని స్పష్టం చేసింది. డిప్యుటేషన్ తీసుకున్నవారిని గడువులోగా రిలీవ్ చేయాల్సిన బాధ్యత తీసుకున్న శాఖ దేనని తెలిపింది.